ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన విధంగా ఉచిత ఇసుక విధానం అమలు చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని CPM పట్టణ కార్యదర్శి పీవీ. ప్రతాప్ డిమాండ్ చేశారు.శనివారం CPM రాష్ట్ర వ్యాప్త ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా పట్టణంలో కప్పల వెంకన్న సెంటర్, నరేంద్ర సెంటర్, గణేష్ చౌక్ వద్ద కరపత్రాలు మరియు గ్రూప్ మీటింగ్స్ CPM ఆధ్వర్యంలో జరిగాయి. చిత్త శుద్ధి తో ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలలో కూడా అమలు చేయాలని, భవన నిర్మాణ సామాగ్రి ధరలు తగ్గించాలని, పెరిగిన నిత్యావసర, కూరగాయలు, కరెంట్ చార్జీలు తగ్గించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా జరిగిన సభలలో ప్రతాప్ మాట్లాడుతూ ఇసుకకు రెక్కలు రావడం వలన ధరలు ఆకాశనంటుతున్నాయని అన్నారు. ఇసుక లేక ఇంటి నిర్మాణాలు, దాని మీద ఆధారపడిన కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. డబ్బులు ఉన్నవారికే బ్లాక్ మార్కెట్ వ్యవస్థ ద్వారా దొరుకుతుందని, పేదలకు ఇసుక దొరకడం లేదని అన్నారు. ఇసుక వలన అటు భవన నిర్మాణదారులు, కార్మికులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నదని తెలిపారు. అందరికి ఇసుక అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలని ప్రతాప్ డిమాండ్ చేశారు. 14న తాహాసిల్దార్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గార రంగారావు, గంగా, అంజి, శ్రీనివాసరావు, నాగరాజు, చంటి, సత్యనారాయణ, జనార్దన్, శ్రీను, నర్సింహామూర్తి తదితరులు పాల్గొన్నారు.
