తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం.. దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) నియమించింది. ఈ వ్యవహారంపై సిట్ బృందం ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించింది. గత శనివారం (సెప్టెంబర్ 28) తిరుమలకు చేరుకున్న సిట్ బృంద సభ్యులు మూడు రోజులు దర్యాప్తు జరిపారు. తాజాగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
దర్యాప్తు ఊపందుకుంటున్న క్రమంలో ప్రభుత్వ అనూహ్య నిర్ణయం తీసుకుంది. సిట్ విచారణకు బ్రేక్ వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి సిట్ విచారణను నిలిపివేస్తున్నట్టు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. టీటీడీ లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు తరువాత దర్యాప్తుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని డీజీపీ వెల్లడించారు. మూడు రోజుల దర్యాప్తునకు సంబంధించిన నివేదికను సిట్ చీఫ్ అందజేశారని వివరించారు. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా పోలీస్ శాఖ దర్యాప్తు కొనసాగుతుందని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.