బాలల హక్కుల పరిరక్షణకు విశాఖ మెట్రో రీజియన్ అథారిటీ పూర్తి సహకారం – చైర్మన్ ఎం.వి ప్రణవ్ గోపాల్

బాలల హక్కుల పరిరక్షణకు విశాఖ మెట్రో రీజియన్ అధారిటి (విఎంఆర్డిఏ) పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందని సంస్థ చైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ అన్నారు. మంగళవారం సిరిపురం ఉడా బిల్డింగ్ లో ఆయన ఛాంబర్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం, ఎం.వి.ప్రణవ్ గోపాల్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుశ్చం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం ఇరువురి మధ్య జరిగిన భేటీలో విఎంఆర్డిఏ పరిధిలో బాలల హక్కులు, వారి సంక్షేమానికి సంభందించిన వివిధ అంశాలపై చర్చించారు, ఎన్టీఆర్ విఎంఆర్డిఏ, పార్క్, కైలాసగిరి పార్క్, తెలుగు మ్యూజియం, డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సెంట్రల్ పార్క్,తొట్ల కొండ, తెన్నేటి పార్క్, కురుసుర సబ్ మెరైన్ ప్రాంతంతో పాటు నిత్యం జన సమ్మర్దంతో ఉండే వివిధ ప్రాంతాల్లో బాల్య వివాహాలు నిర్మూలనపై,బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, పోక్సో చట్టంతో పాటు వివిధ బాలల చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కలిగించేలా హోర్డింగ్ బోర్డులను ఏర్పాటు చేసేందుకు విఎంఆర్డిఏ పరంగా చర్యలు చేపట్టాలని కోరారు అలాగే ఉడా చిల్డ్రన్ ఎరీనా ధియేటర్ లో మరుగున పడ్డ పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, వారాంతపు సినిమాల ప్రదర్శనలు తిరిగి పునః ప్రారంభానికి సత్వర చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతపై సీతారాం, ప్రణవ్ గోపాల్ లు సుదీర్ఘంగా చర్చించారు.అనంతరం విఎంఆర్డిఏ ఛైర్మెన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తన దృష్టికి తీసుకొచ్చిన వివిధ బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమంతో ముడిపడి ఉన్న అంశాలను అమలు చేసేందుకు తమ సంస్థ ఉన్నతాధికారులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి బాలల హక్కుల పరిరక్షణకు విఎంఆర్డిఏ పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందని ఆయన అన్నారు.

Scroll to Top
Share via
Copy link