పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వేంచేసి ఉన్న మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం అమ్మవారి 61వ వార్షికోత్సవ సందర్భంగా మావుళ్ళమ్మ అమ్మవారికి సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం పునర్దర్శనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చక బృందం పురోహితులు ప్రత్యేక హోమాలు జరిపిన అనంతరం శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దర్శనమును పునరుద్ధరించారు. ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏటా డిసెంబర్ నెలలో 11వ తారీకు తర్వాత 15 రోజుల పాటు అమ్మవారు ఆలయాన్ని మూసివేసి సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం ఈరోజు ప్రాత:కాలార్చన, ప్రత్యేక హోమం నిర్వహించిన అనంతరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దర్శనాన్ని ప్రారంభించినట్లు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారిని భారీ సంఖ్యలో మహిళలు, భవానీలు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
