ప్రజలకు అవగాహన కల్పించుటకే చికెన్ & ఎగ్ మేళాకు నిర్వహణ – చికెన్ & ఎగ్ మేళాకు అపూర్వ స్పందన
బుధవారం తణుకు బైపాస్ రోడ్డులో నేక్ కళ్యాణ మండపంలో జిల్లా పశుసవర్ధక శాఖ, పశ్చిమగోదావరి జిల్లా పౌల్ట్రీ ఫెడరేషన్, నెక్, కోళ్ళ రైతుల సంక్షేమ సంఘం సంయుక్తంగా నిర్వహించిన చికెన్ & ఎగ్ మేళా కార్యక్రమానికి జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ సంయుక్తంగా పాల్గొన్నారు. చికెన్, గ్రుడ్డులతో చేసిన ఆహార పదార్థాలను జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ స్వయంగా వడ్డించి, చికెన్ ఎగ్ మేళాను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లా అంతటా ప్రజలు ఏ విధమైన అపోహలు లేకుండా ఉడికించిన గుడ్లు, ఉడకబెట్టిన కోడి మాంసము నిర్భయంగా తీసుకోవచ్చని తెలిపారు. చికెన్ మరియు గుడ్లు షాపులు, రెస్టారెంటు యజమానులు వ్యాపారాలు యధావిధిగా తమ వ్యాపారాలను కొనసాగించ వచ్చునని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో, అంగన్వాడి సెంటర్లలో విద్యార్థులకు, చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారంగా గుడ్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ భయాందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. పక్షులు నుండి ఇతర జంతువులు నుండి మనుషులకు వైరస్ సోకే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదని జిల్లా కలెక్టరు స్పష్టం చేశారు. పౌల్ట్రీ రైతులు గత నాలుగు వారాలుగా ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళతామని జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి అన్నారు.
శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గతనెలలో పౌల్ట్రీపారంలో కోళ్లకు వైరస్ సొకటం వలన ప్రజలలో ఆందోళన చెందారని, కోళ్ళ రైతులు చాలా నష్ట పోయారని అన్నారు. జిల్లాలో 300 మంది పౌల్ట్రీ రైతులు ఉన్నారని, 1 కోటి 60 లక్షలకు పైగా కోళ్ళు పెంపకం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎప్పటికపుడు సహాయక చర్యలు, జిల్లా యంత్రాంగం ఎంతో కష్టపడి పనిచేసి కొన్నిరోజులకే యధాస్థితికి తీసుకురావడం అభినందనీయం అన్నారు. నేను ప్రతిరోజు ఒక గ్రుడ్డు తింటానని, అన్ని వయస్సుల వారు నిర్భయంగా చికెన్, గ్రుడ్డులు తినవచ్చునని అన్నారు. నష్టపోయిన కోళ్ళ ఫారం రైతులకు నష్టపరిహారం అందించుటకు, రుణాలు రీ షెడ్యూల్ చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి నా వంతు కృషి చేస్తానని తెలిపారు.ఎన్డీయే ప్రభుత్వం అన్ని వర్గాలు వారికి మేలు చేసేవిధంగా అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. జిల్లాలో కోళ్ళ ఫారం రైతులు కన్నా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా స్పందించటం ఇది రైతుల సంక్షేమ ప్రభుత్వం అని శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.
జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.ఏ.మురళీకృష్ణ మాట్లాడుతూ పశ్చిమగోదావరిజిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామములోని కృష్ణానందం కోళ్లపారం నుండి ఒక కిలోమీటరు పరిధిలో, పెదతాడేపల్లి గ్రామములోని రామలక్ష్మి కోళ్లపారం నుండి ఒక కిలోమీటరు పరిధిలో మినహా జిల్లా అంతటా చికెన్, గుడ్లు తినవచ్చునని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఖతీభ్ కౌసర్ భానో,జిల్లా పశుసంవర్ధక శాఖ డా.కె.మురళీకృష్ణ, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్లు జావర్ హుస్సేన్, యల్.కె.సుధాకర్,వాకాని ప్రసాదు,తహశీల్దారు డి.వి.వి.యస్.అశోక్ వర్మ, పురపాలక సంఘం కమీషనరు టి.రామ్ కుమార్, యంపిడివో ఆర్.లోహిత్ జయసాగర్,ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ చైర్మన్ కె.వి.సుబ్బారావు, నెక్ చైర్మన్ మల్లిన శ్రీనివాసరావు, నెక్ అడ్వైజరు డా.బాలస్వామి, వివిధ శాఖల అధికారులు, రెస్టారెంట్లు, హోటల్సు యజమానులు, పౌల్ట్రీస్ రైతులు,పెద్ద ఎత్తున చికెన్ మాంసాహార ప్రియులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.