తేతలి సొసైటీలో రూ. 4 కోట్లు కుంభకోణం – రూ. 1.67 కోట్లు నష్టపోయిన డిపాజిట్‌ దారులు

8 మందికి రూ. 35.37 లక్షలు చెల్లించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

గత పాలకుల చేసిన తప్పిదాలతో సొసైటీలో అక్రమాలు

ధాన్యం కొనుగోళ్లలో వచ్చిన కమిషన్‌ బాధితులకు చెల్లింపు

ఆఖరిపైసా అందేవరకు డిపాజిట్‌దారులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే వెల్లడి

గత పాలకులు చేసిన కుంభకోణంలో నష్టపోయిన డిపాజిట్‌ దారులను ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు మండలం తేతలి సొసైటీలో గత ప్రభుత్వ హయాంలో రూ. 4.64 కోట్లు కుంభకోణం చేసి నిధులను పక్కదోవ పట్టించారని వీటిలో రూ. 1.67 కోట్లు మేర డిపాజిట్‌ చేసిన బాధితులను దశలవారీగా ఆదుకుని వారికి తిరిగి చెల్లించే విధంగా చర్యలు చేపట్టామని చెప్పారు. సోమవారం తణుకు ఎమ్మెల్యే కార్యాలయంలో 8 మంది డిపాజిట్‌ దారులకు సుమారు రూ. 35.37 లక్షలు మేర చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తేతలి సొసైటీలో 2017–18 సంవత్సర కాలంలో అప్పటి పాలవర్గం, కార్యదర్శి కలిసి డిపాజిట్లు మళ్లించారని ఆరోపించారు. పాలకవర్గం, అప్పటి సొసైటీ కార్యదర్శి రూ. 2.28 కోట్లు, అప్పటి ఛైర్మన్‌ 28.38 లక్షలు, జాయింట్‌ ఎక్కౌంట్‌ ద్వారా రూ. 2.12 కోట్లు కలిసి రూ. 4.64 కోట్లు మేర నిధులు మళ్లించగా డిపాజిట్‌ దారులకు సంబంధించి రూ. 1.67 కోట్లు నిధులను సొంత అవసరాలకు మళ్లించారని చెప్పారు. అప్పటి నుంచి డిపాజిట్‌ దారులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన డిపాజిట్‌దారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ద్వారా ధాన్యం కొనుగోలు ద్వారా వచ్చిన కమీషన్‌ రూ. 35.37 లక్షలను 8 మందికి అందజేసినట్లు చెప్పారు. ఇంకా రూ. 61 లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు. అప్పట్లో పాలకవర్గాన్ని సైతం తప్పుదోవ పట్టించే విధంగా అప్పటి ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు వ్యక్తిగత సిబ్బంది సైతం రుణాలు తీసుకుని చెల్లించలేదని విమర్శించారు. ఆనాడు కారుమూరి వెంకటనాగేశ్వరరావుతోపాటు ఆయన బలపర్చిన పాలకవర్గం చేసిన తప్పిదాలే ఇందుకు కారణమన్నారు. డిపాజిట్‌ దారులు నష్టపోయిన ఆఖరి పైసా చెల్లించేవరకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link