ఆయన స్ఫూర్తితోనే నియోజకవర్గ అభివృద్ధికి కృషి – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
మాజీ ఎంపీపీ వెంకటరత్నం పదో వర్ధంతి కార్యక్రమం
మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్ ఆరిమిల్లి వెంకటరత్నం స్ఫూర్తితో తణుకు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు తన వంతు కృషి చేస్తానని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు మండలంలో అభివృద్ధి ప్రదాతగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతోందని చెప్పారు. తణుకు మండల పరిషత్ మాజీ అధ్యక్షులు వేల్పూరు గ్రామం మాజీ సర్పంచ్ ఆరిమిల్లి వెంకటరత్నం పదో వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం వేల్పూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ వేల్పూరు గ్రామంలో యువకుడిగా రైతులను సమీకరించి నూతన పద్ధతులను అవలంబించి వారిలో ఒక పెద్దగా వెంకటరత్నం ఉండేవారని గుర్తు చేశారు. గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి సుమారు 18 సంవత్సరాలు పాటు సర్పంచిగా పనిచేసిన ఆయన సమగ్రంగా అభివృద్ధి చేసి గ్రామానికి అనేక పర్యాయాలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గ్రామానికి గుర్తింపు తీసుకువచ్చారని చెప్పారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ ఏ అవసరం వచ్చిన నేనున్నానంటూ ప్రధానంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన జన్మభూమి కార్యక్రమం కంటే ముందుగా తెలుగు క్రాంతి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజల్ని భాగస్వాములు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. తనతోపాటు దాతలను సమీకరించి ప్రజల భాగస్వామ్యంతో పాఠశాలలు, ఆసుపత్రులు అభివృద్ధి చేశారని అన్నారు. వెంకటరత్నం తన సొంత స్థలం 1.60 ఎకరాలు తన భార్య పేరున ఆసుపత్రి భవన నిర్మాణానికి అందజేశారని గుర్తు చేశారు. గ్రామంలో మొట్టమొదటిగా సొసైటీను స్థాపించి రైతులను భాగస్వాములను చేసి ఎప్పుడూ లాభాలు బాటిలో ఉండే విధంగా ఒక పునాది వేసి సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షునిగా పనిచేశారని అన్నారు. తణుకు మండలం ఎంపీపీగా పనిచేసిన ఆయన మండలంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి చేసే విధంగా నిధులను తీసుకువచ్చారని చెప్పారు. కేవలం ప్రజా ప్రతినిధి గానే కాకుండా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి జిల్లాలో పార్టీ అభివృద్ధికి తన వంతు సహకారం అందించారని అన్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆరిమిల్లి వెంకటరత్నం పేరు నిలిచిపోతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా వేల్పూరు గ్రామంలోని దళిత వాడను మోడల్ కాలనీగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. అంతకుముందు ఆరిమిల్లి వెంకటరత్నం విగ్రహానికి పూలమాలలు వేసిన నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే రాధాకృష్ణ పేదలకు దుస్తులు, పండ్లు అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వేల్పూరు గ్రామ ప్రజలు,కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.