మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటపటిమ, దేశభక్తి అందరికీ ఆదర్శం కావాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటపటిమ, దేశభక్తి అందరికీ ఆదర్శం కావాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. అల్లూరి సీతారామరాజు 101 వ వర్థంతి సందర్బంగా బుధవారం భీమవరం సీపీఐ జిల్లా కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి భీమారావు పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ అల్లూరి 27 ఏళ్ళ వయసులో దేశ స్వాతంత్ర పోరాటంలో వీరోచితమైన పాత్ర నిర్వహించారన్నారు. విశాఖ, అడ్డతీగల తదితర మన్యం ప్రాంతాల్లో గిరిజనులను దోచుకుంటూ చిత్రహింసలకు గురిచేస్తున్న బ్రిటిష్ అధికారుల తీరుకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్యపరచి యుద్ధవిద్యలు,గెరిల్లా పోరాట పద్ధతులు నేర్పించి పోరాటాలకు సన్నద్ధ పరచి బ్రిటిష్ వారిని గడగడలాడించారన్నారు. బ్రిటిష్ పాలనలో గిరిజనుల దోపీడీకి వ్యతిరేకంగా వారి హక్కుల కోసం ఆనాడు అల్లూరి పోరాడారని కానీ నేడు స్వపరిపాలనలోను గిరిజనులు ఎలాంటి హక్కులు లేకుండా దోపిడీకి గురవుతున్నారన్నారు. అడవులను విధ్వంసం చేస్తూ గిరిజనుల జీవించే హక్కు హరించి వేస్తున్నారన్నారు. ఆఫరేషన్ కగార్ పేరుతో అటవీ సంపద కార్పోరేట్ లకు అప్పచెప్పేందుకే వందలాది మంది అమాయక, ఆదివాసీ గిరిజనులను నక్సలైటులుగా ముద్రవేసి హతమారుస్తున్నారన్నారు.అడవుల్లో ఆదివాసీ గిరిజనులు లేకుండా చేస్తూ అల్లూరి ఆశయాలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నారన్నారు. గిరిజనుల హక్కులు పరిరక్షణే అల్లూరికి మనం అర్పించే నిజమైన నివాళి అంటూ భీమారావు జోహార్లర్పించారు.
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. సీతారాం ప్రసాద్, జిల్లా సమితి సభ్యుడు మల్లుల శ్రీనివాస్, ప్రజానాట్యమండలి గాయకుడు ఎన్. చంటిరాజు, అభ్యుదయ రచయితల సంఘం నాయకుడు వేల్పుల నాగేశ్వరావు అల్లూరికి నివాళులర్పించారు.