ఉండ్రాజవరం నిర్మల మాతాజీ ధ్యానమందిరంలో ఘనంగా వేసవి శిక్షణా తరగతుల ముగింపు సభ

ధ్యానము ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుందనీ, ధ్యానము ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుందని ఉండ్రాజవరంలోని నిర్మల మాతాజీ ముఖ్య నిర్వాహకులు బంధకవి సాయి శేఖర్ అన్నారు. విద్యార్థినీవిద్యార్థులకు జరిగిన వేసవిశిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. శనివారం రాత్రి స్థానిక నిమ్మతోటలో ఉన్న నిర్మల మాతాజీ ధ్యానమందిరంలో ఈ వేసవి శిక్షణా తరగతుల శిబిరం ముగింపు సమావేశం జరిగింది. తొలుత ధ్యానమందిరం మరో నిర్వాహకులు కుదప ఉమాశంకర్ ఆహూతులకు స్వాగతం పలికారు. సభా వేదికను తెలుగు పండితులు చెరుకూరి వెంకట కృష్ణ ప్రసాద్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మల్లిన రాజేంద్ర ప్రసాద్, భారత వైమానికదళ మాజీ అధికారి కడించర్ల రాజేశ్వరరావు అలంకరించారు. సభను ధ్యానమందిరం నిర్వాహకులు కుదప ఉమాశంకర్ నిర్వహించగా, వేసవి శిక్షణా ఉపాధ్యాయిని శ్రీమతి చింతమనేని పార్వతి సహకరించారు. వేసవి శిక్షణాశిబిరంలో విద్యార్థులకు శతకపద్యాలు, వారు రచించిన “తెలుగు బిడ్డ” శతకంలోని పద్యాలు నేర్పించిన చెరుకూరి వెంకట కృష్ణప్రసాద్ తెలుగుభాష ఉదాహరణకు చేస్తున్న విశేషకృషిని ధ్యానమందిరం సభ్యులు కొల్లేపల్లి రాజేంద్ర గుప్త వివరించారు. భార వైమానిక దళ మాజీ అధికారి కడించర్ల రాజేశ్వర రావు మాట్లాడుతూ, తాను భారత వైమానికదళంలో రాడార్ వ్యవస్థలో పనిజేసాననీ, కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్నానని చెప్పారు. విద్యార్థులు దేశభక్తితో భారత మాత సేవ జేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట రామప్రసాద్ మాట్లాడుతూ బాల్యం చాలా విలువైనదీ, వెలలేనిదీ, తిరిగి రానిదీ అని వివరించారు. మొక్కై వంగనిది మానై వంగునా అనే చందాన లేత వయసులో విద్యార్థులు ఏది నేర్చుకున్నా చక్కగా అబ్బుతుంది చెప్పారు. ఈ సందర్భంగా శిక్షణా శిబిరంలో విద్యార్థులకు శతక పద్యాలు నేర్పించిన తెలుగు పండితులు చెరుకూరి వెంకట కృష్ణ ప్రసాద్, శ్రీమతి శేష మణి దంపతులను నిర్మల మాతాజీ ధ్యాన మందిరం నిర్వాహకులు, ఉండ్రాజవరం గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్ళ శ్రీనివాసరావు, రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట రామ ప్రసాద్ దుశ్శాలువా, జ్ఞాపకాలతో ఘనంగా సత్కరించారు.

మే నెల 11వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు ఇరవై రోజుల పాటు జరిగిన ఈ శిక్షణాకార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులకు శతకపద్యాలు, డ్రాయింగ్, క్రాఫ్ట్, స్పోకెన్ ఇంగ్లీష్ మొదలగు అంశాలలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు రిటైర్డ్ ప్రిన్సిపాల్ మల్లిన రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా జ్ఞాపికలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బూరుగుపల్లి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా పెన్నులు బహూకరించి విద్యార్థులను ప్రోత్సహించారు. అదేవిధంగా శిక్షణా శిబిర నిర్వహణలో సహకరించిన ఉపాధ్యాయులకు, ఇతరులకు నిర్వాహకులు జ్ఞాపికలు బహూకరించారు.

కార్యక్రమానికి ముందు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, ధ్యాన మందిరం నిర్వాహకులు, సభ్యులు, కాలనీ వాసులు, గ్రామస్థులు పాల్గొన్నారు. శనివారం రాత్రి రెండు గంటలు సాగిన ఈ కార్యక్రమం చి.కొడమంచిలి మైత్రేయి వందన సమర్పణతో నాటి ముగిసింది.

Scroll to Top
Share via
Copy link