ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బూరుగుపల్లి శేషారావును కలిసి శుభాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేయాలని సూచన
అమరావతి: నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్ డీసీ) కార్యాలయంలో ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తాడేపల్లి ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బూరుగుపల్లి శేషారావును కలిసి మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తమకున్న అపూర్వ అనుభవంతో సమర్థవంతంగా పని చేసి వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు శిక్షణ అందించి వారిలో నైపుణ్యం పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థకు బూరుగుపల్లి శేషారావు మంచి పేరు తీసుకువస్తారని ఆశిస్తున్నానన్నారు.