తూర్పు, పశ్చిమ ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక గురువారం నిడదవోలు నియోజకవర్గంలోని నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలకేంద్రాలలో నిర్వహించారు. బరిలో మొత్తం ఐదుగురు అభ్యర్థులు ఉండగా ప్రధానంగా పోటీ బొర్రా గోపిమూర్తి, గంధం నారాయణరావుల మధ్య కొనసాగింది. పొటీలో వీరితోపాటు దీపక్ పులుగు, కవల నాగేశ్వరరావు, వామన వెంకటలక్ష్మిలు బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 398 ఓట్లు, మరణాలు తదితర కారణాల వల్ల ఆ సంఖ్య కు 392 గా నిలిచింది. వీరిలో మహిళలు 157, పురుషులు 335 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన ఎన్నిక ప్రక్రియ, ఎన్నిక ముగిసే సమయం నాలుగు గంటలకు 94 శాతం నమోదయింది. దూరప్రాంతాలలో కొందరు, అనారోగ్యంతో కొందరు ఈఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు ఐ.రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఉండ్రాజవరం మండలంలో మొట్టమొదట తన ఓటుహక్కు వినియోగించుకున్న ఐ.రాంబాబు పిడిఎఫ్ బలపరిచిన గోపిమూర్తి గెలుపు ఖాయమని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఎన్నిక ప్రక్రియను ఉండ్రాజవరం తహసిల్దార్ పీఎన్డీ ప్రసాద్, ఏ.ఎస్పి., ఏ.వి.సుబ్బరాజు తదితరులు పరిశీలించారు.
