ముద్దాపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.బి.బి.సుబ్రహ్మణ్యం సూచనల ప్రకారం జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బి.యం.గోపాలరెడ్డి, సాంఘీక శాస్త్ర ఉపాధ్యాయుడు యన్.వి.స్వామి ఆధ్వర్యాన 8వ తరగతి విద్యార్థులు పాఠశాలకు దగ్గరలోని వరి పొలానికి క్షేత్ర పర్యటనకు వెళ్లారు.
ఈ పర్యటనలో రైతు తలారి సత్యనారాయణ, గుల్లపల్లి అక్కిరాజులను ఇంటర్వ్యూ చేసి ఆకుమడి, నాట్లు, ఎరువులు, పురుగు మందులు, కలుపులు, నీటిపారుదల, కోతలు, పెట్టుబడి, దిగుబడి, కష్టనష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఉపాధ్యాయులు, విద్యార్థులు దమ్ము చేసిన పొలంలో దిగి స్వయంగా కొద్దిసేపు నాట్లు వేసి ప్రత్యక్ష అనుభవం పొందారు.
జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బి.యం.గోపాల రెడ్డి మాట్లాడుతూ 8వ తరగతి లో “పంట ఉత్పత్తులు” అనే పాఠ్యాంశానికి సంబంధించి ప్రత్యక్ష బోధనకు ఈ క్షేత్ర పర్యటనకు వచ్చామని, దీని ద్వారా విద్యార్థులు రైతుల కష్టం గుర్తించి ఆహారాన్ని వృధాచేయకుండా ఉంటారని, రైతులను గౌరవిస్తారని ఆశిస్తున్నామన్నారు.
