అంపశయ్య పై ఉన్న చేనేత రంగానికి ఊపిరి పోయాలని, నేతన్నలను ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం క్యాలండర్లను సిపిఐ జిల్లా కార్యాలయంలో
సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చేనేతకు రాష్ట్ర బడ్జెట్లో 2000 కోట్ల రూపాయలు కేటాయించాలని, చేనేత కార్మికులకు 3 సెంట్ల స్థలం ఇచ్చి పక్కా ఇళ్ళు, వర్క్ షెడ్లు ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని కోనాల డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలకు తక్షణమే పాలకవర్గ ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు.
నేతన్ననేస్తం పథకాన్ని 24 వేల నుండి 36 వేలకు పెంచి .స్వంత మగ్గం ఉన్న వారితో పాటు అద్దె మగ్గాల్లో నేసే వారికి, ఉప వృత్తుల వారికి కూడా వర్తింపచేయాలని కోనాల డిమాండ్ చేశారు. చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన జి.ఎస్.టి.ని పూర్తిగా రద్దు చేయాలని, ఆదరణ పథకాన్ని పునరుద్దరించి వృత్తి పరికరాలను సబ్సిడీతో పంపిణీ చేయాలని కోనాల డిమాండ్ చేశారు. 11 రకాల చేనేత వస్త్ర ఉత్పత్తుల రిజర్వేషన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, చేనేత వస్త్ర ఉత్పత్తులకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని, చేనేతలకు ప్రత్యేక బ్యాంకులను ఏర్పాటు చేసి సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని,
సిల్క్ రాయితీని 2 వేల రూపాయల నుండి 3 వేలకు పెంచి, చేనేత కార్మికుల కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ పి.సి.జోషి, చేతి వృత్తుల సంఘం జిల్లా కన్వీనర్ ఎం.సీతారాంప్రసాద్, రజక వృత్తులు సంఘం జిల్లా నాయకులు మల్లుల శ్రీనివాసరావు, మత్స్యకార సంఘం నాయకులు నాగిడి శాంతమూర్తి, ఎ.పి.మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి సికిలే పుష్ప కుమారి, వాయిద్య కళాకారుల సంఘం జిల్లా నాయకులు ఎ.పెద్దిరాజు, ప్రజానాట్యమండలి కళాకారుడు ఛాన్ భాషా తదితరులు పాల్గొన్నారు.
