భార్యను ఎంతగానో ప్రేమించాడు. కానీ ఆమె వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను హత్య చేయించింది.. ఈ కేసును ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ రమేష్ బాబు గురువారం విలేకర్ల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు.
- తెనాలికి చెందిన వెంకటమణి పృథ్వీరాజ్ (27)కు దూరపు బంధువైన వెంకటలక్ష్మితో 5 సంవత్సరాల కిందట ప్రేమ వివాహమైంది. ఆమె మొదటి భర్త అనారోగ్యంతో మృతి చెందగా ఇది రెండో వివాహం. దంపతులకు పిల్లలు లేరు. వీరు ఇద్దరు కొద్ది నెలల కిందట బెంగళూరు వెళ్లి అక్కడ భవన నిర్మాణ పనిలో చేరారు. అక్కడ పనిచేస్తున్న పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన 23 సంవత్సరాల కోటేశ్వరరావు పరిచయం అయ్యాడు. బెంగళూరులో పరిస్థితులు నచ్చక పృథ్వీరాజ్ తెనాలి వచ్చేయగా.. అక్కడే ఉన్న వెంకటలక్ష్మి, కోటేశ్వరరావు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడి వారిరువురూ కలిసి నాలుగు నెలల కిందట వెల్లటూరు చేరారు.
అక్కడ మూడు నెలల సహజీవనం తర్వాత కోటేశ్వరరావు మద్యం తాగి వచ్చి కొడుతూ ఉండడంతో మార్చిలో తెనాలి వచ్చిన వెంకటలక్ష్మి, తన పుట్టింటికి వెళ్లానని అబద్ధం చెప్పి తిరిగి భర్తతో కాపురం చేస్తోంది. అయితే కోటేశ్వరరావు, వెంకటలక్ష్మికి ఫోన్లు చేస్తూ ఉండేవాడు. భర్తకు అనుమానం రాకుండా అన్నయ్య అంటూ అతనితో మాట్లాడుతూ భర్తతోనూ మాట్లాడించేది. ఈ క్రమంలో తమకు అడ్డుగా ఉన్నాడని పృథ్వీరాజ్ ను చంపాలని నిర్ణయించుకున్న కోటేశ్వరరావు, వెంకటలక్ష్మి పక్కా ప్రణాళిక తయారు చేసుకున్నారు. గత నెల 27న కోటేశ్వరరావు, గుంటూరుకు చెందిన తమ బంధువు 19 సంవత్సరాల ఉదయ్ కిరణ్, అతని స్నేహితుడు గుంటూరుకే చెందిన ఆటో నడిపే 15 సంవత్సరాల బాలుడు ముగ్గురు కలిసి బస్సులో తెనాలి వచ్చి పృథ్వీరాజ్ కు ఫోన్ చేసి మల్లెపాడు శివారుకు పిలిపించి అందరూ మద్యం తాగిన తర్వాత అతన్ని కత్తితో పొడిచి రాయితో మోది హత్య చేశారు. అనంతరం హతుడి ఫోన్ తీసుకుని, అతని ఆటోలోనే పరారయ్యారు.
కుమారుడి హత్య విషయంలో కోడలిపైనే అనుమానంగా ఉందని తండ్రి ఇచ్చిన సమాచారంతో కూపీ లాగిన పోలీసులు ఫోన్ ల కాల్ డేటా, ఇతర ఆధునిక సాంకేతికత సహాయంతో సాక్ష్యాలతో సహా భార్యతో సహా నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పృథ్వీరాజ్ భార్యను అమితంగా ప్రేమించేవాడని, వివాహమైన కొత్తల్లో ఆమె పేరు (వెంకటలక్ష్మి) చేతిపై ఇంగ్లీష్ అక్షరాలతో పచ్చబొట్టు పొడిపించుకున్నాడని, తర్వాత ఆమె ప్రవర్తన నచ్చక బాధపడేవాడని, తుదకు ఆమె వల్లే ఇలా ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు వివరించారు.