మృతుల కుటుంబాలకు-అండదండగా ఉంటామని ఓదార్పు

ఇటీవల ఫ్లెక్స్ కడుతూ విద్యుత్తు హై టెన్షన్ వైర్లు తగిలి విద్యుత్ ఘాతానికి గురై ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో మృతి చెందిన నలుగురు యువకుల కుటుంబాలను, గాయపడిన వారి కుటుంబాలను నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస నాయుడు, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి శ్రీనివాస్ సోమవారం పరామర్శించారు.ఈ ప్రమాదంలో మృతి చెందిన మారిశెట్టి శ్రీనివాసరావు, పామర్తి నాగేంద్ర, కాసకాని కృష్ణ, బొల్లా వీర్రాజు కుటుంబాలతో పాటు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కోమటి అనంతరావును పరామర్శించి అన్నివిధాలుగా ఈ కుటుంబాలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పి ఓదార్చారు. పార్టీ పరంగా కూడా అండదండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతులంతా యువకులై చిన్నవయసు కలిగిన వారని, వీరిలో ఇద్దరికీ నెలల వయసున్న చిన్నపిల్లలు కూడా ఉన్నారని, ఒకరికి ఇంకా పెళ్లి కూడా కాలేదని, మరొకరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారని తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు గాయపడిన వారి కుటుంబానికి మాజీ శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు ఆర్థిక సాయం అందించారు. ఏ అవసరం వచ్చినా తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తీవ్ర విచారాన్ని వ్యక్తంచేస్తూ మాజీ శాసనసభ్యులు జి.శ్రీనివాసనాయుడు ఓదార్చారు. వైద్య పరంగా ఏ అవసరమొచ్చినా తన వద్దకు రావచ్చని, వైద్యంకోసం స్థానిక నాయకులు ఆసుపత్రికి తీసుకురావచ్చని పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ధైర్యం చెప్పారు. తీవ్రంగా గాయపడిన కోమటి అనంతరావు వైద్య రికార్డు పరిశీలించి వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకురావాలని స్థానిక నాయకులకు సూచించారు. ఈ సందర్భంగా పరామర్శ కార్యక్రమంలో ఉండ్రాజవరం మండల పార్టీ అధ్యక్షులు, జడ్పిటిసి భాస్కర రామయ్య, పెరవలి ఎంపీపీ ప్రసాద్, నాయకులు గరిమెళ్ళ తాతారావు, వీరమల్లు సత్యనారాయణ, కరుటూరి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ కట్టా వెంకటేశ్వరరావు, భీమరాజు, విశ్వేశ్వరరావు, ఏనుగుపల్లి రాఘవులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link