కార్మిక నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం విశాఖ అభివృద్ధికి విశేష కృషి చేశారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. రాజేంద్రనగర్ లోని నివాసంలో సింహాచలం భౌతిక కాయానికి శనివారం పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పల్లా సింహాచలం మరణం టీడీపీకి, విశాఖ ప్రజలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. టీ.ఎన్.టి.యు.సి. నాయకుడిగా పారిశ్రామిక ప్రాంతంలో కార్మికుల పక్షాన చేసిన పోరాటాలను ప్రజలు మరచిపోలేరన్నారు. సింహాచలం కుమారుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు గంటా తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
