నిడదవోలులో పేదింటి మహిళల కోసం ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
మహిళామణులకు ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన కల్పించే లక్ష్యంతో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలు ఏర్పాటు
స్వయం ఉపాధితో మహిళలకు ఆర్థిక పరిపుష్టి కలుగుతుందన్న మంత్రి
90 రోజుల శిక్షణలో ప్రతి రోజు క్రమం తప్పకుండా హాజరై నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మంత్రి దుర్గేష్ సూచన
3 నెలల శిక్షణ పూర్తయిన అనంతరం ఉచితంగా కుట్టు మిషన్ అందిస్తామని వెల్లడి
నియోజకవర్గంలో 540 మంది మహిళలు కుట్టు మిషన్ శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపిన మంత్రి దుర్గేష్
నిడదవోలు: ఆర్థికంగా వెనకబడిన పేదింటి మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం తద్వారా ఆర్థిక భరోసా అందించాలన్న సమున్నత లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళవారం నిడదవోలు మండల పరిషత్ కార్యాలయము నందు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ సహకారంతో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రం (టైలరింగ్) ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళామణులకు ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన కల్పించే లక్ష్యంతో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలు పనిచేస్తాయని మంత్రి దుర్గేష్ తెలిపారు. 90 రోజులపాటు అందించే ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమానికి క్రమం తప్పకుండా హాజరై నైపుణ్యాన్ని పెంచుకోవాలని తద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించాలని సూచించారు. మహిళలు నైపుణ్యాన్ని సాధించి ఆయా రంగాల్లో నిలదొక్కుకోవాలని, కుట్టు మిషన్ నేర్చుకున్న ప్రతి మహిళలకు చేతి నిండా పని ఉండాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు. సృజనాత్మకతకు పదునుపెడితే మహిళలకు మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని మంత్రి దుర్గేష్ సూచించారు. ప్రభుత్వం తరపున ప్రతి మహిళకు సరైన సహకారం, ఆసరా, భరోసా అందిస్తామని, వారి ఆదాయం పెంపుకు కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి పొందాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కేంద్రాల ద్వారా 3 నెలల పాటు అందించే శిక్షణతో మహిళలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ఈ కేంద్రాల్లో కుట్టుమిషన్ సక్రమంగా నేర్పడం, తదనుగుణంగా మహిళలు నేర్చుకోవడం ద్వారానే ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతుందన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చెందిన దాదాపు 496 మందికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తే నిడదవోలులో మాత్రం తాము 540 మందికి అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఇంటి బాధ్యతలతో పాటు పిల్లల సంరక్షణ చేపడుతున్న మహిళలకు కుట్టు శిక్షణ నేర్చుకోవడం ద్వారా వారి ఆదాయం మెరుగుపడటమే కాక బంగారు భవిష్యత్ ను తీర్చిదిద్దుకునే అవకాశం కలుగుతుందన్నారు. భర్తకు ఆదాయంలో తోడు అందించినట్లవుతుందన్నారు. ఈ పథకం సద్వినియోగం చేసుకోవడం ద్వారా మహిళలు స్వయం ఉపాధిని పొందడమే కాకుండా, వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఆర్థికంగా స్థిరపడవచ్చని సూచించారు. ఈ సందర్భంగా మహిళలు స్వయంకృషితో తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా ఎదిగి ఇతరులకు ఉపాధి కల్పిచేందుకు దోహదపడుతుందన్నారు. రతన్ టాటా స్ఫూర్తితో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటి నుండి ఒకరిని పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసి తద్వారా ఆయా కుటుంబాలను బాగు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా మంత్రి వివరించారు. ఈ క్రమంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు కొయ్యే సూర్యారావు, పెరవలి, ఉండ్రాజవరం మండలాల ఎంపీడీవోలు, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండలాల తహిసిల్దార్లు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, నిర్వాహకులు తిరుమల్ల భాగ్యలక్ష్మీ, పెండ్యాల ఎంపీటీసీ వాకా శ్రీను, కూటమి నాయకులు, మండల, గ్రామ స్థాయి నాయకులు, నియోజకవర్గ మహిళలు తదితరులు పాల్గొన్నారు.